1, మే 2022, ఆదివారం

మనిషి, రూపాయి

June, 16-2020 


మనిషిని రూపాయల్లో కొలిచి, 

మనకోసం ఏమైనా  చేస్తాడ  , చేయగలడా  అన్న కోణంలో లెక్కించి, 

వాడు దాటిన కృషివంతెనలని తక్కువచేసి, 

కాస్త మెదడుని ఉపయోగించి మాట్లాడితే పొగరని, 

నిజాలు చెప్తే రెనాగేడ్ అని నిందలు వేస్తే 

ఏం చేయాలి వాడు ?

ఒళ్ళంతా నిప్పులు  కుమ్మరించుకోవాలా ? 

కోట్ల లీటర్ల ఉమ్మును మీపై దుమ్మెత్తిపోయాలా ?


ఇంకెంతమంది ప్రాణాలు బలై పోవాలి మీ పైశాశికత్వానికి?

ఎన్ని  కిలోమీటర్ల  లోతుల్లో పాతిపెట్టాలి మీ శరీరాల్ని ?

ప్రపంచం మా చుట్టే తిరుగుతుందని , కొమ్ములున్న గుర్రం మా ఇంట్లో ఉందని , 

కార్లు, బార్లు, పైరవీల కలయికతో నిలుపుకున్న జీవితాలు మీవి ....... 


మీరు  పడింది కష్టం అంటే చప్పట్లు కొట్టాలా ?


- Saral

ఆత్మవంచన

June, 20, 2020 


ఎవరి జ్ఞాపకాలు అవి ? దోసిళ్ళలో మోస్తున్నావ్... ?

నువ్వు ఆస్వాదించని అనుభవాల్ని ఎందుకు ముఖానికి పూసుకుంటున్నావ్?

నీదంటూ ఒక్క అడుగు కూడా లేని ప్రయాణాల్ని నీవిగా ఎందుకు చెప్తున్నావ్?

ఎందుకు అబద్దాల అద్దాల్లో నీ ప్రతిబింబాన్ని వెతుకుతున్నావ్? 


మనమంతా గొంగళిపురుగులమే అని తెలియని సీతాకోకచిలుకలున్నాయా? 

మరెందుకు గతాన్ని పాపంలా చూస్తున్నావ్?

ఇంకెతకాలం మోసాల అత్తర్లు  రాసుకుంటావ్ ? 


నువ్వు కట్టుకుంటున్న అరలు అనంతమైన చీకటిలోకి జారుకుంటాయి , 

చిన్న గుడ్డిదీపం కోసం నువ్వు పిచ్చి కేకలు వేసే రోజు వస్తుంది ! 


అబద్దాలు చెప్పటం ఒక కళ అని, 

మోసం చెయ్యటం కూడా నైపుణ్యమని , 

సంపదే అసలైన  నిజమని నమ్మిన మనుషుల్లో కొంతమంది 

ఇప్పటికే స్మశానంలో శాశ్వత విశ్రాంతిలో వున్నారు , 

రంగులు వెలిసిన ఆ సమాధులను చూస్తే 

సత్యం తెలుస్తుంది !  - Ramesh Saral

నువ్వనే నేను


గుర్తుకు వచ్చానా అని అడుగుతావ్ ఎంటి? 

వెన్నెల వెలుగులో చెట్టు నీడ కూడా నీలా కనిపిస్తుంటే 

ఎక్కడున్నావ్ అంటావ్ ఎంటి ? 

నువ్వు పెట్టుకున్న మల్లెల్లో మగత నిద్రలో వుంటే 

మెరిసిపోతూన్నావ్ అంటావెంటి?

నీ కన్నుల వెన్నెల్లో తడిసిపోతుంటే 

నా గుండెల్లో నీ పాదముద్రలు 

నా కన్నుల్లో నీ ప్రతిబింబాలు 

నా గొంతులో నీ మాటలు 

నీ ప్రేమకు శతాబ్దాల బానిసను


- రమేష్ సరల్

ఆయుధాల ఆకలి


ఆయుధాలకు ఆకలి నేర్పిన రాక్షసత్వం 

పసిపిల్లల శవాలను పేరుస్తోంది 


కడుపులో బిడ్డ కోసం కోటి కలలను కంటున్న  

కాబోయే తల్లిని ఒక్క బుల్లెట్ బూడిద చేసింది 


ఏ మానవ విలువల కోసం ఈ యుద్ధం అని ప్రశ్నించలేని   మరమనుషులు సైనికులు 

శవ కారాగారాలను అవిశ్రాంతంగా నడిపిస్తున్నారు 


పెట్రోల్ పై ఆధిపత్యం కోసం రక్తటేరులు పారించిన రాక్షసులు 

అధికారం కోసం సుందర వనాలను శ్మశానాలు చేసిన దైత్యులు 

హిట్లర్ నుండి "ఇడీ అమీన్" వరకు ఏ రాబందైనా 

ఓ రోజు నేల కులాల్సిందే 


నిమిషాల్లో మాయమైన కోట్లప్రజలు 

చరిత్ర పుస్తకాల్లో ఒక చిన్న పాఠ్యంశంగా చేర్చబడటమే అసలు విషాదం 

- రమేష్ సరళ్

జ్ఞాపకాల మరకలు

మార్చ్ 13, 22

గాయం కన్నా అది మిగిల్చిన మరకలు ఎక్కువ సార్లు బాధిస్తాయి 

జ్ఞాపకాలు రాలిపోయిన ఆకులు కావు  మట్టిలో కరిగిపోవడానికి 

 బాధించిన ప్రతి నిమిషం గుండెపై ముళ్ళ కంచె అవుతుంది


సంతోషం , సరదా ఇలా ఎన్ని రంగులు ముఖంపై పోసుకున్నా

నీ మనసు నుండి నువ్వు ఎక్కడికి పారిపోగలవు ?


వెలుతురు ఆస్వాదించే లోపే చీకటి కమ్మేసే  లోకంలో 

ఆది అంతం లేని నిశీధిలో నువ్వొక లెక్కకు కూడా రాని ఇసుక రేణువు ,

విషాదాలు మోసే యంత్రానివి   


కోట్ల సంవత్సరాలనుంచి అలసట లేకుండా తిరుగుతున్న అనంత నీటి గోళానికి  

నీ కన్నీళ్లతో  పనేంటి?


ప్రతినిమిషం ఓ నక్షత్రాన్ని మింగేస్తున్న విశ్వానికి, 

గంటల్లో లక్షల ప్రాణాలను పాతరేసిన సునామీలను పుట్టించే మట్టిముద్దకి. 

ఏ విలువలు నేర్పుతావ్?


డబ్బు కోసం మురికి తింటున్న జీవచ్ఛవాల మధ్య 

మానవత్వం క్షణాల్లో ఆవిరయ్యే అత్తరు 

- రమేష్ సరళ్

19, ఏప్రిల్ 2014, శనివారం

గంగా నది నుండి థేమ్స్ వరకు ... వారణాసి , లండన్ ప్రయాణ జ్ఞాపకాలు

 ఇది చాలా రోజుల నుండి వాయిదా వేసుకుంటూ వస్తున్న టపా. ఒక సంవత్సర వ్యవధిలో నేను చూసిన రెండు మహానగరాలకు వెళ్ళినప్పటి నా అనుభవాలే ఈ పోస్ట్.ఓక నగరం చరిత్రకందని కాలం నుండి మహాశివుడు నడిచిన ప్రదేశమైతే , మరొక నగరం సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంగా చెప్పబడిన ఇంగ్లీష్ పాలకుల ముఖ్య పట్టణం. డిసెంబర్ లోనే వ్రాద్దమనుకుని పని వొత్తిడి వల్ల రాయలేకపోయాను. నా పనిలో భాగంగా అప్పుడప్పుడు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది, నేను చేస్తున్న పనికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.ఫనిలో భాగంగా కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ,జీవితాంతం దాచుకోగలిగిన జ్ఞాపకాలు మిగులుతాయి. కాని నేను లండన్ నగరంలో కాలు పెట్టినప్పటినుండి ఒక చిన్న బాధ , పిల్లలకు దూరంగా వెళ్ళటం వల్లనేమో అనుకున్నాను , కానీ కారణం అది కాదు అని తరువాత తెలుసుకోగలిగాను. ఆది ఏంటో కాసేపట్లో మీకు చెప్తాను.


కాశీ యాత్ర - మా  కంపనీలో freshers ని కేవలం IIT ల నుంచి మాత్రమే తీసుకుంటాం, ఈ recruitment లో భాగంగా ఎవరెవరు ఏయే campus వెళతారో చెప్పండని నా టీం ని అడుగుతూ, నేను బనారస్ హిందూ యూనివర్సిటీ కి వెళతాను అని చెప్పాను. వాళ్ళు నా విన్నపాన్ని సహృదయంతో మన్నించారు :-), వారణాసి  శివుడు నడిచిన ప్రదేశం, ఎవరైనా అక్కడికి భగవంతున్ని దర్శించుకోవడనికే వెళతారు. కానీ నేను బనారస్ వెళ్ళడానికి ప్రధాన కారణం పాలనురుగలతో పరవళ్ళు తొక్కే గంగా నదిని చూడాలనుకోవడం. నాకు దేవుడుపై భక్తీ వుందో లేడో నేనప్పటికి చెప్పలేనోమో , అవసరం వున్నప్పుడు మాత్రమే  దేవుడికి దండం పెట్టె వాళ్లల్లో నేను  వుంటాను . దేవుడికి లంచాల ఆశ చూపే వాణ్ణి మాత్రం కాదు  . అది వొక కారణమైతే , మరోటి నదుల ఫై నాకున్న ఆసక్తి మరొక ప్రముఖ కారణం. ప్రపంచంలో ఏ నదిఅయిన మానవ వికాసానికి పునాదులు.  నైలు,గంగా -సింధు  నదులు దీనికి నేడున్న సజీవ సాక్ష్యాలు. కాశీ కి హైదరాబాద్ నుండి ఫ్లైట్ లేదు కాబట్టి, నేను, ఇంకా మరిద్దరు colleagues తో ఢిల్లీ వెళ్లి అక్కడినుండి connecting ఫ్లైట్ లో వరనస్సి వెళ్ళాము . హోటల్ లో దిగిన క్షణం నుండి ఒకటే ఆలోచన , తొందరగా గంగ నది తీరానికి వెళ్ళాలి ... మిగతా పనులు తర్వాత చూసుకోవచ్చని. ఎలాగు కాంపస్ కి రేపొద్దున వెళ్ళాలి, అక్కడ ఇక్కడ షాపింగ్ చేసే బదులు , గంగలో స్నానం చేసి, విశ్వనాథున్ని దర్శించుకోవటం మేలని నా ఫ్రండ్స్ ని convince చేసి ఒక కాబ్ మాట్లాడుకొని బయలుదేరాము, ఒక 20 నిమిషాల తరవాత కార్ డ్రైవర్ "ఆగాయ సాబ్" అని చెప్పగానే ఒక్కసారిగా కొంత ఉద్వేగం , మాలో ఎవరం ఇంతవరకు వారాణసికి ఎవరం రాలేదు - అందుకనే అంత ఆత్రుత.ఓక రెండు  నిముషాలు నడిచేసరికి గంగా నది కన్పించింది , ఎక్కడ చూసిన వివిధ దేశాల నుండి వచ్చిన ప్రజలే , విచిత్రం ఏంటంటే  అందులో చాల తక్కువమంది వృద్దులు. ఏవైనా ఖరీదైనా  వస్తువులు వుంటే మీతోనే ఉంచుకోండి సార్ ఎవరిని నమ్మవద్దు, నేను  మళ్లి హారతి సమయానికి వస్తాను అని మా కాబ్ డ్రైవర్ చెపుతూ వుంటే , హారతి సమయం ఎప్ప్దుడు అని అడిగాం.  సాయంత్రం 6 గంటలకు మొదలుహత  అవుంతుంది అని చెప్పగానే " మేము అంతసేపు ఇక్కడ ఎం చేయాలి, అని ఆలోచిస్తుండగా మళ్లి  తానే చెప్పాడు , హారతి ప్రక్రియ చాల బాగుంటుంది సార్ , ఇప్పుడు జనం అంతగా లేరని అనిపించే ఈ ఘాట్ లన్ని 10 నిమిషాల్లో వేలమందితో నిండిపోతాయి అని చెప్పుకొచ్చాడు .సరే చూద్దాం హోటల్ కి వెళ్లి చేసేది కూడా ఏమి లేదు అని ఒక  ఘాట్ వైపు నడిచాం . 


దగ్గరికి వెళ్ళగానే .. నా అంచనాలు అన్ని తారుమారయ్యాయి , ఆకు పచ్చగా నీరు , ఎక్కడ చూసిన పాన్ నమిలి ఊసినా మరకలు , చిన్న దుర్గంధం . అది చూడగానే ఎవరో ముఖం మీద గట్టిగా గుద్దిన feeling. ఇక వెళ్ళిపోతే మంచిది అనుకుంటున్నా సమయంలో అక్కడ పడవ నడిపే వ్యక్తీ "సార్ ఇక్కడ నీళ్ళు ఇలాగె వుంటాయి నది మధ్యలోకి వెళితే చాల బాగుంటాయని" చెప్పగానే , సరే అని పడవ  ఎక్కాం , కాని అంతట అదే పరిస్థితి. చేసేదేం లేక కాసేపు అలాగే పడవలో తిరిగి నది అవతలి ఒడ్డు కి స్నానానికని వెళ్ళాం, కాని పరిస్థిలో మార్పు లేదు. నా colleagues స్నానం చేసారుగాని, నాకెందుకో చేయాలనీ పించలేదు , అలాగే నేను పడవలో వుండి  పోయాను.అంత దూరం వెళ్లి గంగ నదిలో స్నానం చేయని వారు వుండరేమో , కాని నాకెందుకో తప్పు అనిపించలేదు. నీళ్ళు ఎంత బాగా లేకున్నా భక్తితో మునక వేయడం ఒక మనదేశంలోనే సాధ్యమేమో , ఆరోగ్యకరం కాదు అని తెలిసినా పుష్కరాలకు వెళ్లి జ్వరాలు తెచ్చుకోవటం ఎందుకో నాకిప్పటికి అర్థం కాదు లాంటి ఆలోచనలు నా మనసులో వస్తుండగానే ... . సిగరెట్లు కాలుస్తాను , మాంసం తింటాను , ఇంతవరకు జీవితం లో పూర్తిగా ఈ రామయనమో , గీతానో చదివినవాడిని కాను , ఈ నమ్మకాలను  విమర్చించే అర్హత నాకెక్కడిది అని నా మెదడుని మూసివేసి , ఇవతల  వొడ్డుకి చేరుకున్నాను. 



at Saranath
సాయంత్రం 5 గంటలు కాగానే మా కాబ్ డ్రైవర్ చెప్పినట్టుగానే జనం రాక  మొదలయ్యింది, కొంత్సేపట్లోనే ఆ ఘాట్ మొత్తం జనంతో  నిండి పోయింది , భజన గీతాలు మొదలు పెట్టారు , హారతిని దగ్గరగా చూడటం కోసం కొందరు డబ్బులిచ్చి పడవల్లో కూచున్నారు . ఎక్కడ చూసిన దీపాలు , 5గురు  యువకులు తీరం పక్కనే చేసిన సిమెంట్ గద్దెలపై పెద్ద హరతులతో సిద్దంగా వున్నారు, ఇంకా కొన్ని నిమిషాల్లోనే హారతి ప్రారంభం అయ్యింది , దాదాపు ఒక అరగంట  పాటు మంత్రాలు, భక్తీ గీతాలతో తీరం హోరెత్తింది , ఒక్కరు కూడా హారతి అయ్యే వరకు అక్కడినుడి కదిలినట్టు నేను చూడలేదు . హారతి చుసిన తర్వాత అప్పటివరకు నా మనసును తొలుస్తున్న బాధంత మాయం . గంగా హరతి  ఒక అద్భుతం.  కాంపస్ రిక్రూట్మెంట్ అయిన మరుసటి రోజు సారనాథ్ వెళ్ళాము. సారనాథ్ స్తూపం, ముసెఅమ్ చూసి , తిరిగు పయనం అయ్యాం . 

లండన్ ప్రయాణం : గత డిసెంబర్ లో strategy meeting కోసమని లండన్ వెళ్ళాను, నాకది మొదటి విదేశీ ప్రయాణం , పైగా డిసెంబర్ లో లండన్ వెళ్ళవలసి రావటంతో ,లండన్ లో వుండే నా స్నేహితులు నన్ను చలి పేరు చెప్పి చాల భయపెట్టారు , ఎందుకైనా మచిదని 10 degree కన్నా తక్కువ temparature కోసమని షాపింగ్ చెసాను. హైదరాబాద్ నుండి పొద్దున్న 4 గంటలకి ఫ్లైట్ , నేను నిద్రపోలేదు ఇంట్లో ఎవరు నిద్రపోలేదు .... Airport అవరకు వచ్చి sendoff ఇస్తానని మా శ్రీమతి అంటే , ఎందుకు అంత రాత్రి పిల్లలను ఇబ్బంది పెట్టడం అని సున్నితంగా వద్దని చెప్పాను . హైదరాబాద్ నుండి దుబాయ్ అక్కడినుండి లండన్ - 12 గంటల ప్రయాణం. 


Airport నుండి బయటకు వెళ్ళగానే వీరీతమైన చలి, తొందరగా బాగ్ ఓపెన్ చేసి coat , gloves వేసుకున్నాను . రెడ్ను నిమిషాల్లో ఒక కాబ్ లోకేల్లి కూర్చోగానే కాస్త releif. St.pauls కి వెళ్లాలి ఎంతవుతుంది అని కాబ్ డ్రైవర్ ని అడిగాను , 80 పౌండ్స్ అన్నాడు .  తల తిరిగిపోయింది , గట్టిగ అరిచి నీకు పిచ్హా అని తిట్టలన్నంత కోపం, 30 నిమిషాల ప్రయాణానికి 8000 వేల రూపాయల? అని, కాని నేను చేసే లెక్క తప్పని , pounds ని రూపీస్ లోకి convert చేసి చూస్తే నేను అక్కడ కనీసం కాఫి కూడా తాగాలేనని గుర్తుకువచ్చి స్థిమిత పడ్డాను . హోటల్ లోకి వెళ్లి స్నానం చేసి , కాస్తా ఏమైనా తిందామని మెనూ చుసాను. రైస్ తో వున్నా ఐటమ్స్ ఏమి లేకపోవడంతో ఒక శాండ్విచ్ తిని పడుకున్దిపోయాను. 


తెల్లారి రెడీ అయ్యి, శాండ్విచ్ మల్లి తినే ఓపిక లేక ఒక ఆమ్లెట్ తిని, కొన్ని పాలు తాగి  ఆఫీసు కి బయలు దేరాను,

at St.Pauls
హోటల్ నుండి బయటకు రాగానే మళ్లీ  అదే చలి , చల్లని నీళ్ళు ఎవరో మీద పోసిన ఫీలింగ్ , గ్లోవ్స్ వేసుకున్నా, వెల్లకి చలి తాకుతూనే వుంది, హోటల్ నుండి మా ఆఫీసు కేవలం 2 నిమిషాల నడక కావడంతో పెద్దగ ఇబ్బంది అనిపించలేదు. కాని రోజు పొద్దున్న నడుస్తున్నప్పుడు  కొన్ని ఆసక్తికరమైన దృశ్యాలు చూసాను . అంత చలిలో కేవలం T -shirt , షార్ట్స్ లో కొందరు జాగింగ్ చేస్తుండగా, స్కూల్ కి వెళ్ళే పిల్లలు  కేవలం sweater తప్ప గ్లోవ్స్ గాని ఇంకా ఏ వింటర్ protection లేకుండా నడుస్తున్నారు. ట్రాఫిక్ వున్నా లేకున్నా ఎవరు సిగ్నల్స్ ని  బ్రేక్ చేయడం చూడలేదు. రోజు పొద్దున్నమంచి breakfast, లంచ్ కి వైన్ తో sandwiches , డిన్నర్ కి ఏదైనా ఇండియన్ ఫుడ్ బయటికి వెళ్లి తినడం , పిల్లలని మిస్ అవుతున్నానన బాధ తప్ప మిగతాదంతా బాగానే ఎంజాయ్ చేశాను . 

నా తిరుగు ప్రయాణం సండే కావటం తో , Saturday రోజు అక్కడవుందే నా తెలుగు colleague తో లండన్ పాస్ తీసుకుని , లండన్ బ్రిడ్జి , వాటేర్లూ , శేక్స్పయార్ గ్లోబ్ , లండన్ museum చూసాం , లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ వెళ్ళటం  కుదరలేదు . ఎక్కడికి వెళ్ళిన, ఎం చెసినా ఏదో ఒక చిన్న బాధ , బాధ అనటం కన్నా , ఒక "disturbing thought " అంటే సమంజసమంగా వుంటుంది . లండన్ museum లో మొఘల్ చక్రవర్తులకు సంబందించిన కొన్ని వస్తువులు , కోహీనూర్ వజ్రం చూసిన తర్వాత అర్థం అయ్యింది నన్ను బాధిస్తున్న ఆలోచన . 


నేనెక్కడున్నాను ? అ ఒక యాభై , అరవై సంవత్సరాల క్రితం వరకు , నా దేశాన్ని దోచుకు తిన్న మరో దేశంలో, వేలాది నా దేశ ప్రజల ప్రాణాలను తీసుకున్న కిరాతక సామ్రాజ్యపు రాజధానిలో, వేల కట్టలేని సంపదనంతా మనకు కాకుండా చేసిన దోపిడిదారుల దేశంలో, ఈ కనిపిస్తున్న ప్రతి కట్టడం వెనుక ఎదో ఒక దేశపు మౌన రోదన ఉండే ఉంటుంది . St.pauls లో వున్నా ఆ జీసస్ కు తెలుసా? తనకు కట్టిన ఈ దేవాలయం గోడలపై భారత వీరుడు భగత్ సింగ్ రక్తపు మరకలు వున్నాయని ? పరిపాలన పేరుతో వీళ్ళ పూర్వికులు సాగించిన కిరాతకాల గురుంచి ఈ ప్రజలకు తెలుసా? వీళ్ళు చారిత్రిక ప్రదేశాలని చెప్పుకుంటున్న ఇవన్నీ, ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళ దేశం చేసిన మరణహోమాలకు మౌన సాక్ష్యాలని ఏనాడైనా అనుకుంటారా ?


థేమ్స్ నది నా కళ్ళకు రక్తపు మడుగుల కనిపించింది  , ఆ ప్రవాహ రొదలో నా ముందు తరాల వారు , జలియన్వలభాగ్ లో చేసిన ఆర్తనాదాలు వినిపించాయి. థేమ్స్ నది నాకప్పుడు , ప్రపంచ వ్యాప్తంగా జరిగిన దోపిడీ జ్ఞాపకాలు మౌనంగా  మోస్తున్నట్టు కనిపించింది . గంగ నది మురికిగా అనుపించవచ్చు ,  కాని ఆ నీటిలో దోపిడీ జ్ఞాపకాలు   లేవు ,  నాగరికతల విధ్వంసపు ఆనవాళ్ళు లేని గంగా నది పవిత్రం కాక మరేమవుతుంది.  ఆ నీళ్ళల్లో లోకా సమస్తా సుఖినోభవంతు అనే వేద ఘోష వుంది 

29, జులై 2013, సోమవారం

వెంటాడే మాటలు

 చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవటం అలవాటయింది , ఆ మరి మాకు ముప్పయేల్లు వచ్చాక అయ్యిందా? అంటారా ,నేను చెప్పేది పాఠ్య పుస్తకాలూ కాకుండా కథలు,కవితల గురుంచి   అదో   వ్యసనం అయ్యింది.తర్వాత చాలామంది స్నేహుతులకు అంటించా  లెండి.   9 వ తరగతిలో వుండగా అనుకుంటాను  నారాయణ రెడ్డి గారి "విశ్వంభర" కొన్నాను,   తర్వాత తిలక్ " అమృతం కురిసిన రాత్రి". మళ్లి మళ్లీ చదవటం వల్ల చాలావరకు నోటికీ వచ్చేవి. సరిగ్గా గుర్తు లేదు గానీ విశ్వంభర ఒపెనింగె మహేష్ బాబు సినిమాల చాలా బాగుంటుంది - పుస్తకం మరొక్క సరి తీస్తే మరింత సరిగ్గా రాయగలననుకుంట ,  ట్రై  చేస్తాను . 
ఇవన్నీ, నిద్రలో, బాధలో, సంతోషంలో  irrespective of any feeling - నన్ను వెంటాడుతాయి
                            "నువ్వు  పుట్టక ముందే తల మీద నీలితెర 
                               కాళ్ళ కింద దూలిపొర" 

అని  మొదలు పెట్టి  - 
                                              " చీకటి మూకల  మధ్య , రక్కసితనం పెంచుకున్నఉక్కు కాకుల మధ్య"  

అని ఇప్పటికి ఎప్పటికి సరిపోయే లోక వర్ణన చేస్తారు సినారె.   

జీసస్ ను శిలువ  వేసే సందర్భాన్ని - 

"పడమటి కొయ్యకు బంధించి , పదును చీకట్ల మేకులు దించి 
నల్లనల్లగా నవ్వింది అజ్ఞానం" అని వెలుగు పై చీకటి   యొక్క తాత్కాలిక విజయం తో పోల్చుతారు . 

తిలక్  గారు -

 secularism గురుంచి టీవీ లోనో , పత్రికలోనో చూసినప్పుడల్లా, మతం ప్రస్తావన వచ్చినప్పుడల్లా
"ఏ దేశ సంస్కృతి కాదు ఒక స్టిర బింధువు 
అది అనేక నదీనదాలు కలిసిన అంతస్సింధువు"

అనే మాట గుర్తుకు వస్తుంది - మా దేశం మంచిది,మన దేశమే మంచిది అన్న భావన కలిగినప్పుడల్లా 

"శ్రీరాముడి శ్రీకృష్ణుడి జన్మస్తానం, మరి కంసుడికి , దశకంతుడికి కాదా? అని ప్రశ్నిస్తుంది  

వీటన్నికన్న ఎప్పుడో ఏదో తెలుగు పత్రికలో చదివిన కవిత తీవ్రంగా వెంటాడుతుంది , కనీసం ఇది ఎక్కడ వ్రాసుకోలేదు కుడా - దాంట్లో వున్న తీవ్రత వల్ల కావచ్చు సగం మాత్రం ఇంకా గుర్తుంది , అదే మళ్లీ మళ్లీ వెంటాడుతుంది 

            చీకటివై ,సిగరెట్ వై,సీసావై కరిగిపోతావో , కాలిపోతావో 
           నలుగ్గోడలే కదా సాక్ష్యం 
          దుఃఖం  వైతరినిలో సైతం ధిక్కార చుక్కానివై సాగుతావ్ 
          నీకన్ని అవసరాలే , అన్నీ అవరోధాలే    
          శిరసెత్తి నిల్చున్న పత్రకరుడా ... సిరమొంచి చెప్తున్నా 
         దుఃఖం నువ్వే , వోదార్పు నువ్వే 

23, జులై 2013, మంగళవారం

మిథిలా నగరంలో సీత స్వయంవరం by ధాత్రి

ధాత్రి ఎవరో కొత్త రచయిత్రి అనుకొనేరు, ధాత్రి అనే పేరుతో సీత స్వయంవరం ఎవరు రాయలేదు, సినిమా కూడా తీయలేదండి, ధాత్రి మా అమ్మాయి పేరు. మీకు మరో విషయం చెప్పాలి , నేను ధాత్రి అని పిలిస్తే తనకు కోపం వస్తుంది ,నాపై అరిచి, నాన్న.. ఎన్నిసార్లు చెప్పాలి, నా పేరు ధాత్రి ఆచార్య, పూర్తి పేరు చెప్పాలి అంటుంది. ఇంత స్పృష్టంగా పలక లేక పోయిన దాని అర్థం మాత్రం అదే.ఆమె వాళ్ళమ్మ బొజ్జలో  ఉన్నప్పటి నుండి ఈరోజుకి వరకు దాదాపుగా నాలుగున్నర సంవత్సరాలు, ప్రతీ రోజు మమ్మల్నిఏదో ఒకరకంగా సర్ప్రైజు చేస్తూనే వుంది. ఆమె పుట్టిన రోజే ఒక పెద్ద సర్ప్రైజ్, ఒక రోజు నేను మాములుగా ఆఫీసు బయల్దేరే ముందు నా అర్దాంగి (అదేనండి తెలుగులో "వైఫ్") నాతో "పొట్టలో కాస్త నొప్పిగా వుంది" హాస్పిటల్ వెళదామా" అంది, డాక్టర్ ఇచ్చిన డెలివరీ డేట్ కి టైం వుంది,ఇప్పుడు ఇలా ఎందుకు అవుతోంది అనుకుంటూనే హాస్పిటల్ కి వెళ్ళాము,అర్థగంట తర్వాత  వచ్చిన డాక్టర్ ...డెలివరీ అయ్యేలా వుంది ,జాయిన్ చెయ్యండి అని చెప్పటంతో కాస్త కంగారు మొదలైంది, ఇంట్లో ఎవ్వరు లేరు, రెండు రోజుల క్రితమే వాళ్ళమ్మ ఊళ్ళో ఏదో పని వుంది చూసుకుని రెండు రోజుల్లో వస్తానని వెళ్ళారు, వరంగల్ కి పంపించమని మా అమ్మ ఎంత పోరుపెట్టిన నేను పంపించ లేదు, మా నాన్నని, అయన నలభీమపాక నైపుణ్యాన్నినమ్మి  మా అమ్మ హైదరాబాద్ రాలేరు -పెద్దవాళ్ళు ఎవరు లేరు, కాబట్టి కొంచెం భయం, మరోవైపు ఉద్విగ్నత.  హాస్పిటల్ కి వచ్చిన విషయం ఎవరికీ  చెప్పలేదు,సాయంత్రం ఎనిమిది గంటల పదినిమిషాలకు ధాత్రి గారు వచ్చేసారు, కొద్దిసేపటి తర్వాత నాచేతుల్లోకి వచ్చేసారు, అవి మరపు రాని క్షణాలు (నాలాంటి అనుభవం చాలా మంది తండ్రులకి వుంటుంది - దురదృష్టం ఏంటంటే సినిమాల్లో ఎక్కువగా ఇలా తండ్రులు ఆనందపడే సందర్భాలు తక్కువ ),అంతవరకు నేనెప్పుడు ఒక రోజు వయస్సున్న పిల్లల్ని ఎప్పుడు ఎత్తుకొలెదు, బహుశ చూడను లేదు. మా అమ్మకి ఫోన్ చేసి చెప్పాను, అదేంటి నాన్న ఇంకా డెలివరీ కి టైం వుంది కదరా, కనీసం పొద్దున్న ఫోన్ చేస్తే నేను వచ్చేదాన్ని కదా, మేము వచ్చేవరకు ఎలా? అని మా అమ్మ తిట్టడానికి రెడీ అవుతుంటే, అబ్బా...అమ్మా... విలాసినికి (నా కజిన్) ఫోన్ చేశాను, వచ్చింది,  నా బిడ్డకి నాలాగే తొందరెక్కువ 20 రోజుల ముందే పుట్టింది అని టాపిక్ మర్చి కూల్ చేశాను. ఆ రోజు నుండి ఇంట్లో ధాత్రి గారే మోస్ట్ వాంటెడ్,మోస్ట్ respected, మోస్ట్ ఇంపార్టెంట్.ఏది చేయాలన్న,చెయ్యొద్దన్నధాత్రి గారి కోణంలోంచి ఆలోచించాలి.

పుస్తకాలూ,క్రికెట్,రాజకీయాలు ఇలా రకరకాల పిచ్చితానాల మధ్య బ్రతికే నేను మా ఆవిడని,అమ్మాయిని ఎలా చూసుకుంటానో అని  మా అమ్మకి ఒకటే బాధ, నా ఫ్రెండ్స్ నన్ను అంకుల్ అని పిలవడం మొదలుపెట్టడం జరిగిపోయింది, దాదాపు 10 రోజుల వరకు ఎవరో ఒకరు ఫోన్ చేసి కంగ్రాట్స్చెప్పేవారు, ఫోన్ వచ్చిన ప్రతిసారి నాకు భయం, ఎందుకంటే వచ్చే ప్రతి పది ఫోన్లలో 5 కొత్త నంబర్లే, ఫోన్ ఎత్తి నమస్తే ఎవరండి మీరు అని అడగలలేక, నన్నునేనే తిట్టుకోలేక నానా అవస్తలు, చుట్టాలతో రిలేషన్స్ మైంటైన్ చేయడంలో మనం కొంచెం వీక్.మరోవైపు ఆఫీసులో నా టీం ఇదివరకన్నచాలా హ్యాపీగా కనిపిస్తున్నారు, విషయం ఏంటని ఆలోచిస్తే అసలు విషయం తట్టింది, నేను ప్రతిరోజు ఆఫీసు నుండి టంచనుగా 7 PM కి బయల్దేతున్నాను, ఇంతకుముందుల ఎనిమిదిన్నర వరకు వుండటం లేదు కాబట్టి, నా టీం కూడా హ్యాపీగా టైంకి ఇంటికి వెళుతున్నారు. అందువలన నాకో చిన్నజ్ఞానోదయం అయ్యింది, బాస్ కి కొత్తగా పెళ్లి అయిన, కొడుకో,కూతురో పుట్టినా బాస్ తో పాటు అతని టీం కూడా ఆనందపడుతుంది. సీత స్వయంవరంలో ఈ పిడకల వేట ఎంటని అనుకుంటున్నారా, అక్కడికే వస్తున్నా.


ధాత్రి గారి రెండవ పుట్టిన రోజు అయిన తర్వాత మాకు కొత్త కష్టాలు వచ్చాయి, రోజు భుజంపై  వేసుకుని పాటలు పాడితేనే నిద్రపోయేది,ప్రతిరోజు అర్థగంట నుండి గంట సేపటి వరకు రోజూ పాతవి,కొత్తవి అని తేడాలేకుండా పాడి నిద్రపుచ్చడానికి నానా కష్టాలు పడేవాన్ని, ఒకరోజు అదేపనిలో వుండగా నా శ్రీమతి వచ్చి నీ కష్టాలు తగ్గే మార్గం చెప్పనా అంటే, చిన్న పిల్లాడికి ఒకేసారి వంద 5 star chocolates ఇస్తానని ఎవరైనా చెప్తే పడేంత ఆనందపడి ఎమిటా ఉపాయం అని అడిగాను, తను మెల్లగా, నువ్వు పాడితే అది నిద్రపోవటం లేదు, దాని నిద్ర పాడైపోతోంది,కాబట్టి పాటలు మానేసి కథలు చెప్పండి అంది. నా గాన కౌశలన్ని అంతగా పొగిడిన మా ఆవిడకు ఓ నమస్కారం చెప్పి కథలు చెప్పటం మొదలు పెట్టాను ఆ రోజునుండి, విచిత్రం చాలా తొందరగా నిద్రపోయేది.మనం  HR లో పని చేస్తాం, చదివింది అదే కాబట్టి కథలు చెప్పటంలో కాస్తా స్కిల్స్ ఎక్కువ, ఆ రోజునుండి నాకు ఎదురులేకున్డపోయింది.ఒక చిన్నపిట్ట అని మొదలు పెట్టి రకరకాల పిట్ట కథలు చెప్పే వాన్ని, అది స్కూల్ కి వెళ్ళటం మొదలు పెట్టిన తర్వాత, పిట్ట అని మొదలు పెట్టాగానే...బ్లూ పిట్టా?అరేంజ్ పిట్ట డాడీ అని అడిగేది, ఏదో కలర్తో మేనేజ్ చేసి కథ  పూర్తి చేసేవాన్ని.పాపం కొన్ని రోజుల నా కథలతో బోర్ కొట్టి వాళ్ళమ్మను కథలు చెప్పమని అడిగేది.నా కష్టాలు మా ఆవిడకి ట్రాన్స్ఫార్ చేసి నేను హాయిగా చదువుకొనే వాన్ని.


ఒకరోజు ఆఫీసు నుండి ఇంటికి రాగానే నా దగ్గరికి వచ్చి నాన్న.. మమ్మీ ఈ రోజు కొత్త కథ చెప్పింది, నేను నీకు చెప్పన అని అడిగింది, సూపర్ నన్ను కథలు చెప్పమని అడగటం తప్ప ఇంకా ఏమైనా అడుగు తల్లి,ఇంతసేపు  ఆఫీసులో చాల మందికి కథలు చెప్పి అలసి పోయాను అని చెప్పి తనను నా పై కుర్చోపెట్టుకున్న, మెల్లగా మొదలు పెట్టి ఏదో కథ చెపుతోంది, చాలాసార్లు విన్న కథలా వుంది, దశరథ మహారాజు పేరు, రాముని పేరు మాత్రం వినబడింది, ఇదేదో అద్భుతంలా వుందని, మళ్లి చెప్పమనగానే దసరథ మహారాజు నుంచి మొదలు పెట్టి,మిథిలా నగరంలో సీత స్వయంవరం, అడవికి వెళ్ళటం, ఆంజనేయస్వామీ, రావణున్ని చంపటం, పట్టాభిషేకం ఇలా ఏది వదలకుండా రామాయణం మొత్తం రెండు నిమిషాల్లో చెప్పింది.. చాలా ఆనందంగా అనిపించింది, భవిష్యత్లో నా కూతురుకి నెలకు కోటి రూపాయల   ఉద్యోగం వచ్చినా అంత ఆనందం కలగదేమో.రామాయణం పైన వుంటే ఇష్టం వల్లనో, సీత పై వుండే భక్తి వల్లనో , ofcourse సీతమ్మ పై వుండే భక్తివల్లనే.రాముడిక్కన్న సీతమ్మ అంటేనే చాలా భక్తీ, బహుశా ఆమె ధైర్యం, మహారాజు బిడ్డ అయినప్పటికీ రాముడి మాటకోసం ఆమె అడవిలో పడిన కష్టాలు, పిల్లలను పెంచిన తీరు, రామాయణంలో సీత పాత్ర చిత్రణ కంటే మరో అద్భుతం లేదు.


అప్పుడే నిర్ణయించుకున్నాను నా బిడ్డకి పది  ఏళ్ళు వచ్చిన తర్వాత రామాయణం మొత్తం వివరంగా చెప్పాలి అని,సీత ధైర్యం గురుంచి చెప్పాలి, సీత లేదంటే రామాయణమే లేదనే నిజాన్ని చెప్పాలి, రావణున్ని చంపటం వల్ల రాముడు దేవుడు కాలేదు, సీత భర్త కావటం వల్ల అయ్యాడు అన్ననిజం చెప్పాలి.సీత పుట్టిన దేశంలో అమ్మాయిలకి అమ్మ గర్భంతో సహా ఏది భద్రమైన ప్రదేశం కాదని చెప్పాలి, ఆడపిల్లకి జన్మ ఇవ్వడానికి, పెంచడానికి, స్వేఛ్చ ఇవ్వడానికి ధైర్యం లేని కర్మభూమి మనది అనే విషతుల్యమైన నిజాన్ని చెప్పాలి, సీతమ్మకు రావణుడి ఒక్కడితోనే భయం, ఇప్పుడీ దేశంలో నిమిషానికీ ఒక నిర్భయను చంపేస్తున్నారు అన్నదుఃఖాన్నిచెప్పాలి.నా బిడ్డకు బోల్డ్ గ వుండటం నేర్పటం కోసం చెప్పాలి.


15, జూన్ 2013, శనివారం

ఉరి తీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం

ఆఫీసు నుండి ఇంటికి వస్తూ ఏదో కొందామని రోడ్డు వైపునున్న చిన్న షాప్ దగ్గర ఆగాను, నేను డబ్బులు ఇస్తూ వుండగా తెల్లగా, బక్క పల్చగా వున్న వ్యక్తి వచ్చాడు.  వచ్చి రావడంతోనే షాప్ ఓనర్ తో  "ఏమైయ్యా ఇది ఏమైనా మర్యాదగా వుందా" అని మొదలుపెట్టి  కాస్త అమర్యాదైన భాషలోకి దిగాడు.ఇంకో ఐదు నిముషాలు వింటే గాని  అర్థం కాలేదు అసలు సంగతి . ఆ వ్యక్తీ షాప్ ఓనర్ కి అప్పు ఇచ్చినట్టున్న్నాడు, ప్రతిరోజు ఇంత చొప్పున వడ్డీతో కలిపి తిరిగి ఇవ్వాలి, ఇవ్వని రోజున ఇలాంటి  తిట్లు చిన్న షాప్ వాళ్ళకి తప్పవు. "ఈరోజు ఇవ్వలేనండి "చలో అసెంబ్లీ" వాళ్ళ ఇవ్వాల షాప్ పెద్దగ అమ్మలేదు,రేపు మళ్లి బంద్ అంటున్నారు , అన్ని కలిపి ఆదివారం ఇస్తానండి" అన్నాడు షాప్ ఓనర్, కష్టపడి  నిజాయితీగా బ్రతికే మనిషిలాగా కనిపిస్తున్నాడు , కానీ అప్పించిన వ్యక్తి వినే పరిస్టితిలో  లేడు "అవన్నీ చెప్పకు నాకు గంటలో వస్తాను డబ్బులు సిద్దంగా  ఉంచు" అని కరకుగా చెప్పి వెళ్ళాడు.

మెల్లగా మొదలైన వర్షంలాగా నాలో ఈ ఆలోచన పెద్దగయి కొంచెం బాధ పెట్టడం మొదలైంది, మనలో కొందరికి బంద్ అంటె అసహ్యం -దాన్ని ఒక రాజకీయ కుల్లులో  భాగంగా చూస్తాం, కొంతమందికి ఆనందం హాయిగా ఇంట్లో కూర్చోని టీవీ చూస్తూ కెసిఆర్ ,రాజగోపాల్ ను తిట్టుకోవచ్చు. కానీ, చెల్లి పెళ్లికో, నాన్న వైద్యానికో ఇల్లు పొలం అమ్మి ఉళ్ళో చేసేదేంలేక హైదరాబాద్ వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు ,పనులు చూసుకొనే వేలాది మంది సామాన్యులకు భయం. సంవత్సరాలుగా ఈ బంద్ లతో సాధించింది ఏమిటి?ప్రజలను మరింత దుర్బర పరిస్టితుల్లోకి  నెట్టడం తప్ప, స్వతంత్ర భారతాన్ని అపహాస్యం చేయడం తప్ప ? చిన్నప్పుడు చదివిన నారాయణరెడ్డి గారి కవిత మళ్లీ మళ్లీ గుర్తుకువచ్చి గుండెను మెలి తిప్పుతుంది




అందరూ తనవాళ్ళే ఆయినా ......  అ కుమ్ములాట ఎందుకని 
చిందుల మధ్య అనాధ శిశువులా చితికి పోతుంది స్వాతంత్రం 

"The more educated we are,the more biased we become, " ని నిజం చేస్తూ మేధావులు అనబడే వారుతెలంగాణా ,ఆంధ్ర అని  రెండు వైపులా విడిపోయి మీరు తప్పంటే మీరు తప్పని తమ గొప్పని నిరుపించుకోవటానికి విఫల ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ప్రజల జీవితాన్ని మెరుగుపరిచే నిర్ణయం ఏదీ అని ఆలోచించే నాథుడు లేడు. మరో వైపు గత 50 సంవత్సరాల్లో నిరాహార దీక్ష్య చేస్తూ ప్రజల కోసం ప్రాణమిచ్చిన ఒక్క నాయకుడు లేడాయే . 

వేలాది పసిమొగ్గలు పుట్టిన నెలరోజుల్లోనే కనుమూస్తుంటే,వందలాదిమంది రైతులు సాగు చేసే పొలంలోనే పురుగుల మందులు తాగుతుంటే తెలంగానానో,శ్రీకాకుళం  నో ,వరంగల్ నో ప్రత్యేక రాష్త్రం చేస్తే వచ్చే లాభం ఏంటి ? అత్యంత హేయమైన అవినీతి యంత్రాగం,రాజకీయనాయకులు మరానప్పుడు వంద రాష్త్రాలు చేసినా ప్రజలకు ఒరిగేది ఏంటి? ఒక చిన్న సర్టిఫికేట్ తీసుకోవడానికి లంచం ఇవ్వడం తప్పుతుందా? వందలాది కోట్ల రూపాయలు మేస్తున్న పందికొక్కులు రాత్రికి  రాత్రి సాధువులవుతరా?

మరి దేనికోసం ఇంతమంది ప్రజలు కెసిఆర్ కు మద్దతు పలుకుతున్నారు? రాష్త్రం రావణకాష్టం ఎందుకు అవుతోంది ? జనాలకు చిన్న ఆశ , తమ పిల్లలకు నాలుగు ఉద్యోగాలు వస్తాయేమోనని, తమ పొలాలకు  నీళ్ళ సౌకర్యం దొరుకుతున్దేమనై ఆశ - దీన్ని గుర్తించకుండా తెలంగాణా ప్రజలకు పని లేదు అస్తమానం రోడ్లపైకి వస్తరనొ ,ఆంధ్ర ప్రజలు దుర్మార్గులు వచ్చే రాష్స్త్రాని అడ్డుకున్టున్నారో అని తిట్టుకోవడం భావ్యం కాదు. మర్యాదలు మరిచి పరస్పరం దూషించుకోవటం దుర్మార్గం ,అల చేసుకుంటూ పోతే అన్నమయ్య ని ఆంధ్రకు ,పోతనను తెఅలంగానకు విభాజించికుంకు పొగలమా? "నిఖిలలోకమెట్ల నిర్ణయించిన తిరుగులేదు నాకు విశ్వనరుడ నేను" అన్న జాషువా ఎవరివాడవుతాడు . ఇందుకేనా 20 సంవత్సరాలు నిండని యువకులు ప్రాణాలు ఇచ్చింది? ఇదేనా ఆ ఉరి తీయబడ్డ శిరస్సులు చెప్పిన రహస్యం, ఈ రకంగా నేనా భారత ధాత్రి ఋణం తీరుకునేది ? కొడుకులు విడిపోయి తల్లులని వృద్ధ్రశ్రమాల్లో చేర్చే సంస్కృతి మనకు కొత్తకాకపోయినా "స్వతంత్ర భారత ధాత్రి ని" చేర్చగలిగే వ్రుద్ధ్రాశ్రమం ఎక్కడని వెతుకుతాం?